Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్ర జోరుగా కొనసాగుతున్నది. ఇప్పటికే 2500 కిలోమీటర్లు పూర్తయ్యింది. ఈయన ఆదివారం అర్ధరాత్రి గన్నవరం నియోజకవర్గానికి చేరుకున్నారు. జోరు వర్షం కురుస్తు్న్నా ఆగకుండా, అర్ధరాత్రి 2గంటలకు గన్నవరం నియోజకవర్గంలోకి అడుగు పెట్టారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. సోమవారం తెల్లవారుజామున ఆయన గన్నవరంలోకి అడుగుపెట్టగానే శ్రేణులు, స్థానికులు పార్టీ జెండాలతో ఘనంగా స్వాగతం పలికారు. నియోజవకవర్గంలోని పెలుమనూరులో ఆయనకు అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు.
గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీకి జంప్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ పైనే తిరుగుబాట చేశారు. టీడీపీ కార్యాలయాన్ని తన అనుచరులతో ధ్వంసం చేయించారు. దీనిని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఈసారి ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని అనుకుంటున్నారు. లక్ష మంది భారీ బహిరంగ సభకు శ్రేణులు సిద్ధమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సభకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. అయితే మరోవైపు వైసీపీ కీలక నేత యార్లగడ్డ ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. సోమవారం గన్నవరంలో యువనేత లోకేశ్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. ఆయన అనుచరులతో కలిసి టీడీపీలో చేరబోతున్నారు. దీంతో ఈ బహిరంగ సభకు మరింత ఊపు వచ్చింది. నారా లోకేశ్ పాదయాత్రను నియోజవకర్గంలో సక్సెస్ చేసే బాధ్యత ఇక ఆయనకు దక్కబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే టీడీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేసినా, యార్లగడ్డ రాకతో మరింత జోష్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తున్నది. ఇక ఇక్కడి నుంచే వల్లభనేని వంశీకి గట్టి సవాల్ తెలుగుదేశం విసరబోతున్నట్లుగా సమాచారం.