Congress-Majlis : రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు. శాశ్వత శత్రువులుండరన్నది నిర్వివాదాంశం. ఇవాళ శత్రువులుగా ఉన్న వారు తరువాత మిత్రులుగా మారుతారు. ఇప్పుడు మిత్రులుగా ఉన్నవారు భవిష్యత్ లో శత్రువులుగా మారడం సహజమే. కాంగ్రెస్ ఇప్పుడు మజ్లిస్ పై ప్రేమ చూపిస్తోంది. గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎంఐఎంతో అంటకాగిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ మజ్లిస్ తో అంతర్గత ఒప్పందం కుదుర్చుకుంది. సానియా మీర్జా నుంచి ఫిరోజ్ ఖాన్ వరకు కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ నుంచి పోటీకి నిలబెట్టే అభ్యర్థి విషయంలో తర్జనభర్జన పడుతోంది. అధికారంలో లేనప్పుడు అన్ని రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన మజ్లిస్ ఇప్పుడు దోస్తీగా ఉండేందుకు సిద్ధమైంది. అలాంటి పార్టీలు ఇప్పుడు ప్రేమ కురిపించుకుంటున్నాయి.
మజ్లిస్ తో స్నేహపూర్వకంగా ఉంటే మైనార్టీ ఓట్లు చీలిపోకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఇలా మైత్రి బంధం కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్, మజ్లిస్ ఫ్రెండ్ షిప్ విషయంలో పరస్పర అవగాహనకు వచ్చాయి. హైదరాబాద్ లోక్ సభ బీసీ అభ్యర్థిని పోటీలో ఉంచాలనుకుంటోంది. దీంతో ఈ పార్టీల కలయిక ఎందాకా నిలుస్తుందో తెలియడం లేదు.
హైదరాబాద్ ఎంపీ సీటుకు బీజేపీ నుంచి మాధవీలత పోటీలో ఉంది. ఆమె ఎంఐఎంకు గట్టి పోటీనిస్తుండటంతో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని రంగంలో దించాలని యోచిస్తోంది. ఇది మజ్లిస్ కు కలిసొస్తుందని అనుకుంటున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య పరస్పర ఒప్పందం మేరకు కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు మజ్లిస్ కు మేలు చేస్తాయా? చూడాల్సిందే.
గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే విధంగా ఎంఐఎంకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే చేస్తోంది. దీంతో కాంగ్రెస్ కు ఏం లాభం కలుగుతుంది. మిగతా వారి ఓట్లు మాత్రం కోత పడే అవకాశాలుంటాయి. దీంతో ఎవరు అధికారంలో ఉంటే దాంతో అంటకాగడం మజ్లిస్ కు అలవాటే. కాంగ్రెస్ పార్టీ పాచిక పారుతుందా? లేదా వేచి చూడాలి.