Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్గా కనిపిస్తుంది. చాలా మంది దీన్ని కేవలం రుచి కోసమే అనుకుని పక్కకు తీసిపడేస్తుంటారు. అయితే, కరివేపాకు వల్ల కలిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. కరివేపాకు తాజా సువాసన, కమ్మని రుచిని అందిస్తుంది. మన పూర్వికులు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారంటే ఒక కారణం ఈ కరివేపాకే.
కంటి చూపు మందగిస్తోందా..?
జుట్టు రాలిపోతోందా..?
ఒంట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉందా..? ‘B-12’డాక్టర్ చెప్పారా..?
మల్టీ విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారా..?
చెడు కొలెస్ట్రాల్ సమస్య ఉందా..?
ఇన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం – మీ పెరటి మొక్క.
అంతేకాదు యాంటీ క్యాన్సర్, యాంటీ ఫంగల్ లక్షణాలున్న ఈ సంజీవని ప్రతి ఇంటి పెరట్లో కొలువై ఉంటుంది.
కరివేపాకులోని టానిన్లు, కార్బాజోల్ ఆల్కలాయిడ్లు హెపటైటిస్, సిర్రోసిస్ వంటి వ్యాధుల నుంచి కాలేయాన్ని కాపాడతాయి.
ఆరోగ్యపరంగా వరదాయిని ఈ అమృత వల్లి – రైతుల పాలిట కల్పవల్లి !
పోపుల డబ్బాలో పదిలంగా దాచుకుంటారు. ఇల్లాలి పంచప్రాణాలకు సమానమైన ఆ చెట్టు కరివేపాకు.
కరి అంటే ఏనుగు.
ఏనుగు బ్రతికున్నా చనిపోయినా ఏనుగు విలువ ఒకటే. అలాగే కరివేపాకు ఇంట్లో ఉంటే ఆరోగ్య సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. సాగుబడి చేస్తే సిరులు కురిపిస్తుంది.
కరివేపాకు లేని తాలింపు సున్నం లేని తాంబూలం. అందుకే తాలింపులో తప్పనిసరి అయింది కరివేపాకు. కూరలో కరివేపాకు ఎంతటి ఆరోగ్యన్నిస్తుందో కరివేపాకు వాసన కూడా అంత సౌభాగ్యాన్ని ఇస్తుంది. కరివేపాకుని సంస్కృతంలో ‘గిరినింబ’ అంటారు. గిరి అంటే పర్వతం, నింబ అంటే వేప అని అర్థం.
వేపాకు, కరివేపాకు, మునగాకు ఎక్కడ ఉంటే అక్కడ ధన్వంతరి ఉంటాడట..!
కొందరు కరివేపాకు, మునగాకు కలిపి ఆకుకూరగా తీసుకోవడంలోని ఆంతర్యం – ఐరన్ లోప నిర్మూలన !
అందుకే విదేశీయులు ‘కర్రీ లీఫ్’ అని అందంగా పిలుచుకుంటారు మన కరివేపాకుని. చక్కగా ప్రాసెస్ చేసి ప్యాకింగ్ తో ముస్తాబు చేసి విమానాలలో సగవురవంగా తమ దేశానికి తీసుకెళ్తారు. మరికొందరు కరివేపాకు ఆకులను పొడి చేసి వాడుకుంటారు. దీనికి ఇపుడు మంచి మార్కెట్ వచ్చింది.
ఒక ఎకరా కరివేపాకు సాగు చేస్తే ఆ రైతు జీవితం వెళ్లిపోతుంది. ఎలాగంటే మూడు నెలలకో, ఏడాదికో ఈ పంట మార్పిడి అవసరం పడదు. ఒక్కసారిగా విత్తనం వేసి తొమ్మిది నెలలు పోషిస్తే, ఆ మొక్క తక్కువలో తక్కువగా పాతిక ముప్పై ఏళ్ళు ఆ రైతుని పోషిస్తుంది.
ఈ కరివేపాకుకి ఈ నేల, ఆ నేల అన్న పట్టింపు లేదు. వేళ్ళూనడానికి అనువైన నేల ఉంటే చాలు; రాళ్లూరప్పలు బండలు లేని ఎర్ర మట్టి, నల్ల మట్టి, ఇసుక పోరల ‘మట్టిలో మాణిక్యం’ గా బతికేస్తుంది. నీటి వసతి రెండు అంగుళాల బోరు ఉంటే చాలు ఐదు ఎకరాలకు తడి పెట్టవచ్చు. రైతుని కంటతడి పెట్టించని ఏకైక పంట ఇదే. నేలను చదును చేసి పదును పెట్టి సాలు దున్ని విత్తి తడిపెట్టడానికి – మొదటిసారి విత్తనాలకు, సాగుకు, బోరుకు లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. కోయంబత్తూరు, భువనేశ్వర్, ఆంధ్రాలోని పలు ప్రాంతాల నుంచి గుంటూరు వ్యాపారులు కరివేపాకు విత్తనాలు సేకరించి అమ్ముతారు. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లయ్ రూల్ అమలవుతుంది.
ఈ విత్తనాలు నిల్వ ఉండవు కనుక సప్లైని బట్టి రేటు ఉంటుంది. ఒక్కో కేజీ విత్తనాలు 50 రూపాయల నుంచి 350 రూపాయల వరకు అమ్ముతారు. ఎకరానికి దాదాపుగా 200 కేజీల విత్తనాలు అవసరమవుతాయి. గ్రిప్ సేద్యం చేస్తే నీరు పొదుపు అవుతుంది, మొక్క తడుస్తుంది, కరెంటు కలిసొస్తుంది. బోరు నీరు అయితే యేళ్ళకి నీరు అందుతుంది. గ్రిప్ అయితే మొక్క వెన్ను కూడా తడుస్తుంది. విత్తిన తర్వాత తొమ్మిది నెలలకు మొక్క ఏపుగా దాదాపుగా రెండున్నర మూడు అడుగులు ఎదిగి నవనవలాడుతుంది. బుసకొడుతున్న తాచులా కాంతులీనే తొలి పంటను ముక్కలుగా కట్ చేసి టన్నులుగా భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు లోడింగ్ చేస్తారు.
ప్రధాని మోడీ రైతుల కోసం ఆన్లైన్ ట్రేడింగ్, పేమెంట్ సౌకర్యాలు మరియు మార్కెట్ కి వచ్చిన మాల్ క్వాలిటీ, క్వాంటిటీ ప్రతి రైతు తెలుసుకొనే నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఈ ఆన్లైన్ సహకారంతో మార్కెట్ కి వస్తున్న మాల్ డిమాండ్ ను బేరీజ్ వేసుకొని కటింగ్ చేసి లోడ్ పెట్టడం ఒక పద్ధతి. ఏజెంట్ ఆర్డర్స్,పేమెంట్ ఆన్లైన్లో తీసుకుని కటింగ్ చేసి లోడ్ పెట్టడం మరో పద్ధతి.కేరళ, బాంబే, కలకత్తా తదితర పట్టణాలలో ట్రేడర్స్ ఉన్నారు. వారు రైతుల నుంచి పంట కొని దుబాయ్ వంటి విదేశాలకు ఎగుమతి చేస్తారు. మాల్ కటింగ్, ప్రాసెసింగ్, కాటన్ బాక్స్ లలో – ప్యాకింగ్ లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ – ఏజెంట్ టీమ్ కార్గో విమానాల్లో విదేశాలకు పంపుతారు. ట్రేడింగ్ పేమెంట్ అంతా నమ్మకం మీద జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్,పేమెంట్స్ జరుగుతాయి.
దోమ, పురుగు తదితర తెగుళ్లు సోకకుండా సేంద్రియ ఉత్పత్తులు, జీవామృతం ప్రయోగిస్తారు. భూసారం కాపాడుకోవడానికి గోమూత్రం, పేడ, ఊక, పొట్టు, మట్టి మిశ్రమం చేసి ఎరువుగా వేస్తారు. రసాయన ఎరువులు, మందులు వాడితే మొక్క ఆయుష్ 5 ఏళ్లకు దిగిపోతుంది; ఊపిరి తీసిన వారవుతారు. అందువల్ల ఆర్గానిక్ కరివేపాకు సేద్యానికి రైతు కట్టుబడి ఉంటాడు. రైతుల కట్టుబాటు ఎరిగిన ఏజెంట్లు అందుకు తగిన ప్రతిఫలం రైతులకు ముట్టచెబుతారు. ఏజెంట్లు మధ్య మధ్యలో వచ్చి మొక్కవిత్తే విధానం, విత్తనం క్వాలిటీ పరిశీలిస్తారు. రైతులు ఉపయోగించే పై మందులు, భూసారాన్ని కాపాడే విధానం గమనిస్తారు. నమ్మకాన్ని మించిన అమ్మకం లేదు.
ఏడాదికి మూడు నాలుగు సార్లు కటింగ్ చేస్తారు. ఏడాదికి ఎకరాకి రెండు లక్షల తక్కువ కాకుండా సంపాదిస్తారు. ఏడాదికి పాతిక టన్నులు ఉత్పత్తి. దాదాపుగా రెండున్నర లక్షల ఆదాయం. ఖర్చులు పోను రెండు లక్షల నికర రాబడి.
విద్యాధికుడు – మోడీ భావజాలాన్ని పునికి పుచ్చుకున్న ఆధునిక ఔత్సాహిక రైతు బాంధవుడు – బిజెపి రాష్ట్ర మీడియా ఇంచార్జ్ మరియు గుంటూరు జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ అయిన పాతూరి నాగభూషణం గారు గుంటూరు, ప్రకాశం, అనంతపురం తదితర జిల్లాలలో వందల ఎకరాలలో కరివేపాకు సాగు చేస్తున్నారు, మార్కెటింగ్ చేస్తున్నారు. ఈ కరివేపాకు సాగు విషయమై సందేహాలు ఉన్న వారు, సలహాల కోసం పాతూరి నాగభూషణం గారిని సంప్రదించవచ్చు.
-Dr.Kandamuri Samaikya
M.pharm, B.A.M.S (RGUHS)
RASAVAIDYA, Consultant Ayurvedic Physician
Cell: 9573646825