PM Narendra Modi : కేంద్రం తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు అందించింది. రైల్వే ప్రాజెక్టుల్లో తెలుగు రాష్ట్రాలకు కొన్నేళ్లుగా సరైన న్యాయం జరగడం లేదనే ఆరోపణలకు చెక్ పెట్టినట్లు అయింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ర్టాల్లో ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గుంటూరు బీబీనగర్ డబ్లింగ్ పనులకు ఆమోద ముద్ర వేసింది. రూ. 3238 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టుకు సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం.
డోన్ మహబూబ్ నగర్, మేడ్చల్-ముద్దేడ్ మధ్య కూడా డబ్లింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బారాంగ్, కుర్దా రో డ్, విజయనగరం మధ్య మూడో లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దేశంలో రైల్వే లైన్ల విస్తరణకు, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బిహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ పనులు చేపట్టేందుకు నిర్ణయించింది.
మొత్తం రూ. 32 వేల కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు అంచనా వ్యయంగా చెబుతోంది. ఇంత పెద్దమొత్తంలో వ్యయం చేసి రాష్ట్రాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపనుంది. దీంతో దక్షిణాదిపై పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈ ప్రాజెక్టులు కేటాయించిందనే వారు కూడా ఉన్నారు. కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మనకు మేలు కలగనుంది.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ దక్షిణాదిలో సత్తా చాటాలని చూస్తోంది. ఇప్పటికే గెలుచుకున్న స్థానాలతో ఊపు మీదున్న బీజేపీ మరిన్ని సీట్లు కైవసం చేసుకుని రాష్ట్రంలో క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రయత్నిస్తోంది. దీని కోసం ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దీని కోసం పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.