Nara Lokesh meet Amit Shah : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. చంద్రబాబుపై వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేశారు. అక్రమ అరెస్టుతో జైల్లో పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడున్నారని ఆరోపించారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని గుర్తు చేశారు.
చంద్రబాబు ఎన్ని కేసులు పెట్టారు? మీ పై ఎన్ని కేసులు పెట్టారు? అని అమిత్ షా ప్రశ్నించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నామని అన్నారు. 73 ఏళ్ల వయసులో చంద్రబాబును బాధించడం భావ్యం కాదని పేర్కొన్నారు. జగన్ తీరుపై లోకేష్ అమిత్ షాకు వివరించారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. దురుద్దేశపూర్వకంగా కేసులు ఆపాదించడం లాంటి పనులు చేస్తూ వ్యయ ప్రయాసలకు గురి చేస్తున్నారు. ప్రతిపక్షాలపై కుట్రపూరిత చర్యలకు దిగడం సమంజసంగా లేదు. దీంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని లోకేష్ వాపోయారు.
ఇన్నాళ్లు చంద్రబాబును జైల్లో పెట్టించింది కేంద్రమేననే ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు లోకేష్ కు అపాయింట్ మెంట్ ఇచ్చిన అమిత్ షాతో కలిసి మాట్లాడే అవకాశం ఇవ్వలేదా? బాబు అరెస్టు సబబు కాదని అమిత్ షా కూడా పేర్కొన్నారు కదా అని బీజేపీ నేతలు చెబుతున్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
చంద్రబాబును అసలు బయటకు రానిస్తారా? లేదో అనే సందేహాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో బాబును ఎన్నికలు అయ్యే వరకు జైలులోనే ఉంచుతారనే వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా తో లోకేష్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తానికి ఏపీలో ఏం జరుగుతోందో తెలియడం లేదు.