Chandranna Mark Varalu : టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తన మార్క్ చూపించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే వరాలను ప్రకటించారు. ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాల సందర్భంగా రాజమండ్రిలో అట్టహాసంగా నిర్వహించిన మహానాడులో ఈ మేరకు ఆయన వెల్లడించారు. అభివృద్ధి, అడ్మినిస్ర్టేషన్ లో చంద్రబాబునాయడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు ఆయన ప్రజల నాడి వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలను మాత్రమే ప్రవేశపెట్టేందుకు అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు అతి దారుణంగా ఉన్నా, సంక్షేమ పథకాల వైపే చంద్రబాబు మొగ్గు చూపించారు. అభివృద్ధిపై కాకుండా కేవలం సంక్షేమ పథకాలనే కోరుకుంటున్న వారే ఓట్లే లక్ష్యంగా ప్రస్తుతం ఏపీలో పార్టీలు అడుగులేస్తున్నాయి. ఉచితాలకు అలవాటు పడిన ప్రజలను మెప్పించేలా టీడీపీ, వైసీపీ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. పేర్లు మార్చినా పథకాలు మాత్రం అవే కొనసాగుతున్నాయి.
మహా శక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి.. 18 ఏండ్లు నిండిన వారికి నెలకు రూ. 1500 ఇస్తామని ప్రకటించారు. అంతటే ఏడాదికి రూ. 18000, ఐదేండ్లకు రూ. 90వేలు ఇస్తారన్నమాట. ప్రస్తుతం కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రకటించింది. అయితే అక్కడ నెలకు రూ. 2వేలు ఇస్తామని పేర్కొంది. దానిని ఇక్కడ రూ. 1500 ఇస్తామని చెప్పి, చంద్రబాబు ప్రకటించారు.
తల్లికి వందనం పేరిట.. ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15 వేలు.. దీపం పథకం ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, గ్రామీణ ప్రాంత మహిళలకు ఉచితప్రయాణం.. పల్లె వెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణం లాంటివి ప్రకటించారు. యువగళం నిధి కింద నిరుద్యోగులకు రూ. 3వేలు, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, అన్నదాతలకు రూ. 20 వేలు ఇస్తామని ప్రకటించారు.
అయితే ప్రస్తుతం తెలంగాణలో అన్నదాతలకు రూ. 10 వేలు ఇస్తున్నారు. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం రూ. 13.50 వేలు ఇస్తున్నది. దానిని ఏడాదికి రూ. 20వేలుగా ప్రకటించారు. రాష్ర్టంలో ఇంటింటికీ మంచినీళ్లు, బీసీలకు రక్షణ చట్టం, పేదలను సంపన్నులను చేయడం లాంటివి టీడీపీ చీఫ్ ప్రకటించారు. అయితే ఇందులో యువగళం నిధి కొంత కొత్తగా కనిపిస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వరాలతో అయినా 2024 వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి.