Congress Six Guarantees : మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలో వచ్చిన కాంగ్రెస్ తరువాత మాట మారుస్తోంది. బీఆర్ఎస్ ను పాతిపెడతామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇచ్చిన హామీల సంగతేందని ప్రశ్నించారు. కేవలం రెండు హామీలు నెరవేర్చి అంతా అయిపోయిందనుకుంటున్నారని దుయ్యబట్టారు.
కేంద్రంలో ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఇప్పుడు షరతులు పెట్టడం సరికాదన్నారు. ఇండియా కూటమిలో మిత్ర పక్షాలు అన్ని తమ దారి తాము చూసుకున్నాయి. వీరితో కలవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. దీంతో కాంగ్రెస్ ఆశలు గల్లంతే అని తెలుస్తోంది. ఇండియా కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోవడంతో కాంగ్రెస్ ఒకటే మిగిలింది. దీంతో వీరు కేంద్రంలో ఎలా అధికారంలోకి వస్తారని ప్రశ్నిస్తున్నారు.
రూ.2 లక్షల వరకు అప్పు తెచ్చుకోండి మేం మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాఫీ చేయడం లేదని అడుగుతున్నారు. మహిళలకు నెలకు రూ.2500 లు ఇస్తామని చెప్పినా ఇంతవరకు ఆ ప్రయత్నాలు చేయడం లేదు. రూ.500 లకే సిలిండర్ ఇస్తామని చెప్పినా అది కూడా నెరవేర్చడం లేదు. దీంతో ప్రభుత్వంపై విశ్వాసం పోతోంది.
ఆటో డ్రైవర్ల జీవితాలను నాశనం చేశారు. వారి ఉపాధిని దెబ్బ తీశారు. ప్రజాభవన్ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసినా కాంగ్రెస్ లో చలనం లేకుండా పోయింది. బీఆర్ఎస్ ను పాతిపెడతామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని త్వరలో పడగొడతామని సవాల్ చేశారు. లేనిపోని ప్రగల్బాలు పలుకుతూ రేవంత్ రెడ్డి చేస్తున్న చర్యలకు తగిన గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు.