Sharmila : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీర్తి గడించిన నేతల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికీ ఆయన పేరును రెండు తెలుగు రాష్ట్రాలు తలుచుకుంటూనే ఉంటాయి. విలువలు ఉన్న నేతగా గుర్తింపు సంపాదించుకున్నారు వైఎస్సార్. ఆయన రాజకీయాల్లో ఉన్న సమయంలో తన వారసులు ఎవరినీ తీసుకువచ్చేందుకు ఇష్టపడలేదని పార్టీలో చెప్పుకుంటారు. అయితే, తనకు సాయంగా ఉంటారని తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డిని మాత్రం ప్రోత్సహించారట. ఆయన ఎంపీగా వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చురకుగా ఉండాలని వివేకాను తీసుకువచ్చారట.
1978 నుంచి దాదాపు పదిహేనేళ్ల తన రాజకీయ జీవితంలో వివిధ హోదాలలో ఆయన పని చేశారు. పీసీసీ చీఫ్ గా, మంత్రిగా ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం తన రాజకీయ వారసత్వం ఇవ్వలేదు. 1989లో ఆయన ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చినపుడు వైఎస్ వివేకా ఎంట్రీ ఇచ్చారు. తనతోనే రాజకీయం ముగించాలని వైఎస్సార్ వివేకాతో తరుచూ చెప్పేవారట. తనకు 60 ఏళ్లు వచ్చేసరికి రాజకీయాల నుంచి విరమణ పొంది పీస్ ఫుల్ లైఫ్ గడపాలని అనుకునేవారట. కానీ ఆయన 60 ఏళ్లకే ఈ లోకాన్ని వీడారు.
2009లో కడప ఎంపీగా తొలిసారి వైఎస్ జగన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. జగన్ ఎంట్రీపై చాలా సంవత్సరాలు ఆలోచించారట వైఎస్సార్. ఇక ఆయన బతికి ఉండగానే జగన్ వచ్చారు కాబట్టి వారసుడు వచ్చాడనే అంటారు. కానీ ఆయనను రాష్ట్రం తరుఫున కేంద్రానికి పంపించారు. రాష్ట్ర రాజకీయ వ్యవహారాల్లో అంతగా జోక్యం చేసుకోకుండా చూసేవారని మాత్రం వైఎస్సార్ మిత్రులు చెప్తారు. ఇక అన్నకు సహాయంగా వైఎస్ తనయ షర్మిల ఉన్నారు. అప్పటికీ ఆమె కేవలం సహాయంగా మాత్రమే ఉంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు.
తండ్రి మరణం అన్న ఏపీ రాజకీయాల్లో చురకుగా వ్యవహరించడం చక చకా జరిగిపోయాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత కేవలం పార్టీ కోసమే షర్మిల పని చేశారు. కానీ ఏ దశలోనూ ప్రత్యక్ష రాజకీయాలపై ఆమె ఆసక్తి కనబర్చలేదు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో అన్నా చెల్లెలు మధ్య గ్యాప్ పెరిగిందన్న వాదనలు వినిపించాయి.
2022 మొదట్లో తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేపట్టారు. కానీ గమ్యంలేని పాదయాత్రగా అది మారింది. దాదాపు ఆమె మూడున్నర వేల కిలో మీటర్లు తిరిగారు. కానీ ప్రజల్లోకి పూర్తిగా వెళ్లలేదని, పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కష్టమని పార్టీ నేతలు ఆమెకు వివరించారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే కలిసి రావచ్చని ఆమెకు సూచించారు. దీంతో ఆమె తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయకుండా కాంగ్రెస్ తో పొత్తు అన్నారు.. ఆ తర్వాత మద్దతిచ్చారు. ఆ తరువాత విలీనం అన్నారు. ఇలా గందరగోళంలోకి పార్టీని నెట్టారు.
అయితే, తెలంగాణలో ఆమె పార్టీ పోటీ చేయడం, విలీనం పెద్దగా ప్రభావం చూపదని రేవంత్ అధిష్టానంకు విన్నవించాడు. ఆమె కూడా గతంలో రేవంత్ పై హాట్ కామెంట్స్ చేయడంతో తెలంగాణలో ఆమెకు ప్రాధాన్యత దక్కలేదు. దీంతో ఆమెను ఏపీకి వాడుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యలో ఇటీవల నారా లోకేశ్ షర్మిలకు క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పడం మరో ట్విస్ట్. ఎందుకంటే ఏపీలో నారా, వైఎస్ కుటుంబాలు రాజకీయంగా బద్ధశత్రుత్వం కలిగినవి దీంతో లోకేశ్ ట్వీట్ కొంచెం కాకరేపిందనే చెప్పవచ్చు. ఇది టీడీపీ వ్యూహమా? లేక కావాలని చేసిందా? అన్నది తెలియాల్సి ఉంది.
షర్మిల కాంగ్రెస్ నేతల టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఏపీ కాంగ్రెస్ లో పనిచేస్తే స్వాగతిస్తామని పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కూడా స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఢిల్లీలో 27న మీటింగ్ లో ఇది ఫైనల్ కానుంది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అన్న జగన్ కు ఎదురు నిలిచి పోరాడేందుకే షర్మిల సిద్ధం అయ్యారని అంటున్నారు. టీడీపీతో కూడా ఆమె సఖ్యతగా ఉంటుందని, అందుకే క్రిస్మస్ గిఫ్ట్ అని వాదనలు వినిపిస్తున్నాయి. సరే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు ఇస్తే అద్భుతాలు జరుగుతాయా? అన్నది చర్చగా మారింది. కాంగ్రెస్ కు 2014, 2019లో నోటా కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఇక ఇప్పుడు పుంజుకుంటుంది అనుకుంటే అయిదు నుంచి ఆరు శాతం ఓట్లు పెరగవచ్చు అంతకంటే సాధించేది ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఆ ఓట్లను వైసీపీ నుంచి చీలుస్తారా లేదా.. టీడీపీ నుంచి చీలుస్తారా? అన్నదే ఇక్కడ చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు వెనక్కి తీసుకొని వచ్చేందుకే షర్మిలకు పగ్గాలు అందించాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోందన్న వాదనలు లేకపోలేదు. ఎంత చెప్పుకున్నా షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ నిలబడుతుందా అన్నదే చిక్కు ప్రశ్న. ఈ క్రమంలో వైసీపీకి ఆమె నష్టం చేకూరిస్తే రాజకీయంగా టీడీపీకే లాభం కలిసి వస్తుందని అంటున్నారు.
ఇలా కాకుండా ఓట్ల చీలిక విపక్షంలో జరిగితే మళ్లీ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు. అప్పుడు కూడా షర్మిల రాజకీయంగా తనకంటూ ఎటువంటి గుర్తింపు లేకుండా ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద షర్మిలకు దూకుడు తప్ప వ్యూహం కనిపించడం లేదని అంటున్నారు. అన్నతో విభేదాలను రాజకీయ పోరాటాలుగా మలుచుకుంటే ఎంత వరకూ కరెక్ట్ అంటూ వాదనలు వినిపిస్తున్నాయి.