TS Notifications : తెలంగాణ నిరుద్యోగులకు తెలుగులో నచ్చని ఒకే పదం ‘త్వరలో’. గత పదేండ్లుగా వినివిని అలసిపోయారు. ‘త్వరలో’ ఎప్పుడొస్తుందో.. మంచి రోజులు ఎప్పుడొస్తాయో వారికి అసలే తెలియడం లేదు. దశాబ్ద కాలంగా ‘‘కొలువుల జాతర’’, ‘‘కొలువుల పండుగ’’ అనే మాటలు.. కర్ణకఠోరంగా ఉంటున్నాయి.
పదేండ్ల కాలంలో ఒక్క గ్రూప్-1 పోస్టును భర్తీ చేయలేని రాష్ట్రం మనది. పదేళ్లలో ఒకే ఒక డీఎస్సీ, పదేళ్లలో ఒకే ఒక గ్రూప్-2, ఇక జూనియర్ లెక్చరర్లు, ఇతర పోస్టుల సంగతి దేవుడెరుగు. రాజకీయ పదవులను, రాజ్యాంగ పదవులను సమయానికి ముందే భర్తీ చేసుకునే పాలకులు.. ఉద్యోగాల విషయానికొచ్చే సరికి ఖజానాలో డబ్బులు లేవని తెగ ఆలోచిస్తుంటారు. ప్రజాప్రతినిధులే కాదు అధికారులు, సిబ్బంది కూడా ముఖ్యమే కదా. అసలు ప్రజలకు సేవా చేసేది, పథకాలు రచించేది, పథకాలు అమలు చేసేది అధికారులే కదా. వారు చెబితేనే కదా మీరు సంతకాలు పెట్టేది. అన్నీ అధికారులు, సిబ్బంది చేస్తే మీరొచ్చి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి వెళ్తూ ఉంటారు. మరి అలాంటి పోస్టులను రెగ్యులర్ గా భర్తీ చేసేందుకు ఎందుకు వెనకాడతారో తెలియదు. యూపీఎస్సీ లాగా ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తే అసలు ఏ గొడవ ఉండదు కదా.
గత బీఆర్ఎస్ పదేళ్లు నానా ఇబ్బందులు పెట్టి.. ఎన్నికలు ఉన్నాయని 80వేల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంది. కానీ పరీక్ష నిర్వహణలో, వాటిని పూర్తి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో లీకేజీలు, రద్దులు, వాయిదాలు ..ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేకపోయింది. దీంతో నిరుద్యోగుల ఆగ్రహానికి గురై ప్రతిపక్షంలోకి పడిపోయింది.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నిరుద్యోగుల ఓట్లతో. బీఆర్ఎస్ ను గద్దె దించాలని లక్షలాది నిరుద్యోగులు ‘‘కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది.. వేగంగా పోస్టులు భర్తీ చేస్తుందేమో’’ అన్న ఆశతో ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. నిరుద్యోగులు లేకుంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది కాదని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. అలాంటి నిరుద్యోగులను చిన్నచూపు చూస్తే ప్రభుత్వాల పీఠాలు కదిలిపోతాయని తెలంగాణ నిరుద్యోగులు నిరూపించారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం అని కాంగ్రెస్ నేతలు చెప్పారు. వారి చెప్పిన ప్రకారం.. ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పటివరకూ టీఎస్పీఎస్సీ బోర్డు రాజీనామాలే ఆమోదించలేదు. ఇంకా కొత్త బోర్డును ఏర్పాటు చేయలేదు. ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఏ పరీక్ష రాయకుండా 2023 గడిచిపోయింది. లక్షల్లో అప్పులు తెచ్చి నిరుద్యోగులు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. కొందరు ఇప్పటికే తమవల్ల కాదని ఆవేదనతో కాడి దించేశారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బోర్డు ఏర్పాటుపై వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ రాకుంటే.. ఫిబ్రవరి 15 తర్వాత లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నికల కోడ్ మే వరకు ఉంటుంది. అంటే ఇక లోక్ సభ ఎన్నికల వరకు ఏ ఎగ్జామ్ రాయకుండా ఉండాలా? ఆ తర్వాత జూన్ లో నోటిఫికేషన్ వేసినా.. అది రిజల్ట్ రావాలంటే 2025 రావాల్సిందేనా?. ఇంత జాప్యాన్ని నిరుద్యోగులు భరించగలరా? వారిలో ఆవేశం ఇప్పటికే కట్టలు తెంచుకుంటోంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. మరీ ప్రభుత్వం బోర్డు ఏర్పాటుపై ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఇక తాత్కాలిక ఉపశమనంగా మెగా డీఎస్సీకి చర్యలు తీసుకోండి అని ఆదేశాలు ఇచ్చారు. దీనికి మీడియా అంతా ‘త్వరలోనే మెగా డీఎస్సీ’ అని హెడ్ లైన్స్ పెట్టేశారు. త్వరలో అంటే మరో పదహేను రోజులా? నెల రోజులా?.. చర్యలు తీసుకోమన్నారు అంతే కదా. అంటే అది తేలే వరకు ఐదారు నెలలు పడుతుంది. అప్పుడు ఏ పదివేల పోస్టులో వేస్తారు. దానికి త్వరలో మెగా డీఎస్సీ అనడం ఎందుకు అని నిరుద్యోగులు ఫైర్ అవుతున్నారు.