Tribute to Jahnavi : ఇటీవల అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కందాల జాహ్నివికి తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జాహ్నవి మరణం తెలుగు సమాజాన్ని తీవ్రంగా కలిసి వేసింది. కళాశాల నుంచి తను ఉంటున్న రెసిడెన్సీకి వెళ్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆమె ఘోరంగా మరణించింది.
అయితే ఈ కేసుపై అక్కడి పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు తెలుగువారిని మరింత కలిచి వేసింది. దీంతో తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణకు హాజరైన పోలీస్ అధికారి తన తప్పు లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు. పూర్తి విచారణ తర్వాత సదరు పోలీస్ అధికారి సస్పెండ్ కు గురయ్యాడు. దీనికంతటికీ జాత్యహంకారమే అంటూ వాదనలు సైతం వినిపించాయి.
జాహ్నవి మృతికి సంతాపంగా ‘బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA)’, ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA)’, ‘అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ (AIA)’ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ తీశారు. సెప్టెంబర్ 20వ తేదీ (బుధవారం), సాయంత్రం 7 గంటలకు స్వాగత్, అబెల్ స్ట్రీట్, మిల్పిటాస్, కాలిఫోర్నియా – 95035 లో కార్యక్రమం జరిగింది. ఆమె మరణంతో భారత్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి తామంతామద్దతుగా ఉంటామని చెప్పారు.
ఆమె మరణం ఒక్క వారి కుటుంబానికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీలను కూడా బాగా కలిచివేసిందన్నారు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగిన తీరును తీవ్రంగా తప్పబట్టారు. అన్ని రంగాల్లో డెవలప్ అయిన అమెరికాలో ఇంకా జాత్యంహకారం ఉండడం మంచిదికాదన్నారు.