IPL season 16 Final fight : ఐపీఎల్ సీజన్ 16 నేటితో ముగిసినట్లే.. నేడు అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ సమరానికి అంతా సిద్ధమైంది. రెండు టీంలు బలంగానే ఉండడంతో ఫైనల్ ఫైట్ ఉత్కంఠగా మారింది. టోర్నీ లీగ్ దశలో అత్యధిక పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగిన గుజరాత్ పటిష్ట బ్యాటింగ్ లైనప్ తో ప్రత్యర్థికి సవాల్ విసురుతున్నది. మరోవైపు ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఐపీఎల్ ఫైనల్ కు చేరడం సీఎస్కేకు ఇది పదోసారి. ఈసారి కనుక కప్పు గెలిస్తే ఇప్పటివరకు ఐదు సార్లు చాంపియన్ గా నిలిచినట్లవుతుంది. అయితే గుజరాత్ టైటాన్స్ గెలిస్తే వరుసగా రెండోసారి విజేతగా నిలుస్తుంది. అయితే ఈ మ్యాచ్లో సీఎస్కే టీం కెప్టెన్ ధోనీ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. ఐపీఎల్ లో 250 మ్యాచ్ లు ఆడిన ఆటగాడగా చరిత్ర సృష్టించనున్నాడు. తరువాతి స్థానాల్లో రోహిత్ శర్మ(243), దినేశ్ కార్తీక్(242) విరాట్ కోహ్లీ(237) ఉండనున్నారు. అయితే ధోనీ మరో రికార్డుకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. సీఎస్కే విజేతగా నిలిస్తే ఐదు సార్లు కప్పు గెలిచిన జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్ గా ధోని రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటివరకు ఇది రోహిత్ శర్మ పేరిట ఉంది.
అయితే సీఎస్కేకు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే నే అతిపెద్ద బలం. మరోవైపు రహానే, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీ ఉండనే ఉన్నరు. ఇక గుజరాత్ ను తక్కువ అంచనా వేయడానికి ఏమి లేదు. అక్కడ కూడా బ్యాటింగ్ లైనప్ పెద్దదే. మరి ముందుగా గుజరాత్ ను కట్టడి చేయాలంటే భీకర ఫామ్ లో ఉన్న శుభమన్ గిల్ ను ఆదిలోనే అడ్డుకోవాల్సి ఉంటుంది. అయితే ధోనికి మ్యాచ్ ను ఎలా మలుపు తిప్పాలో తెలిసినంతగా మరొకరికి తెలిసి ఉండదు. అయితే గుజరాత్ టైటాన్స్ కు కూడా బౌలర్లు షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మలతో బలంగా ఉంది. వీరి ప్రదర్శన కూడా ఈ సీజన్ లో ఆకట్టుకున్నది. క్వాలిఫయర్ 1 లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు వరుసగా రెండోసారి టైటిల్ గెల్చుకోవాలని గుజరాత్ టైటాన్స్ భావిస్తున్నది. అయితే ఇక విజేత ధోనీ సేననా. .హార్దిక్ టీమా తేలాలంటే మరికొన్ని గంటలు వేచిచూడాల్సిందే.