Jagan : మొన్నటి దాక తమ గెలుపు నల్లేరు నడకే అన్నట్టు భావించిన వైసీపీకి అధిష్ఠానానికి షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇక షర్మిల కాంగ్రెస్ లో చేరితే తమకేమి నష్టం ఉండదని మొదట్లో ఆ పెద్దలు అంచనా వేశారు. కానీ షర్మిల చేరికతో మొదటగా నష్టపోయేది ఆ పార్టేనని తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరితే టీడీపీ-జనసేనలపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. కానీ వైసీపీలో సిట్టింగుల్లో మార్పులు, చేర్పుల ప్రభావంతో రోజురోజుకూ అసంతృప్తుల సంఖ్య మరింతగా పెరిగిపోతోంది. జగనన్న విసిరిన బాణాన్ని అని అప్పట్లో షర్మిల డైలాగ్ చెప్పేది. ఇప్పుడు ఆ డైలాగ్ ప్రకారం జగనన్న బాణం.. జగనన్నపైకే దూసుకొస్తుందని ప్రతిపక్షాలు కామెంట్ చేస్తున్నాయి.
పీసీసీ ప్రెసిడెంట్ గా దాదాపు షర్మిల ఖాయమేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంటే ఇక ఏపీలో అన్నా, చెల్లెలి పోరు ఖాయమేనని చెప్పవచ్చు. వాస్తవానికి వైఎస్ షర్మిల రాజకీయాలపైగాని, ఇతర విషయాలపై గాని వైఎస్ జగన్ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంట్లో ఒక్కరే రాజకీయం చేయాలని, అది తాను ఎలాగూ చేస్తున్నాను కాబట్టి షర్మిలకు ఎందుకు రాజకీయాలు అన్న భావన మాత్రం లోపల ఉండిఉంటుంది. కానీ ఆయన ఏ రోజు ఆ విషయాలను బయటపెట్టలేదు. ఆయన పరోక్ష విమర్శలు చేసినా.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల మాత్రం అన్నపై దూకుడుగానే వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.
షర్మిల కాంగ్రెస్ లో చేరడంతో వైసీపీకి గడ్డు కాలం మొదలైనట్టే అని చెప్పాలి. ఇక ఆమెకు పీసీసీ ఖాయయమ్యే అవకాశాలు ఉండడంతో వైసీపీ అసంతృప్తులు షర్మిల వెనక నడిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిల వెనక నడుస్తానని చెప్పారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సుధాకర్ బాబు లాంటి సీనియర్ నేతలు షర్మిల వైపు మొగ్గు చూపుతున్నారు. సంక్రాంతి వరకూ వైసీపీ ఫైనల్ లిస్ట్ పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక దాంట్లో పేర్లు ఉండనివారు షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ లో చేరేందుకు క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. మాజీ కాంగ్రెస్ నేతలందరినీ మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీ నేతలు షర్మిలతో టచ్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో షర్మిలతో బస్సు యాత్ర చేయాలని ఆలోచనలో కూడా అధినాయకత్వం ఉందని సమాచారం. నెలాఖరులో అమరావతిలో ప్రియాంక తో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.