కర్ణాటకలో బీజేపీ ఓటమిపై బీఆర్ఎస్ నేతలు సంబురపడుతున్నారు. కర్ణాటక విజయం తర్వాత చాలా మంది మాటల్లో దక్షిణాది అనే మాట వినిపిస్తోంది. సౌత్ లో బీజేపీకి చోటు లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని తెలుస్తోంది. ఓ పద్ధతి ప్రకారం సౌత్ ను హైలెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రకటనలను బట్టి చూస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ తరచూ చెప్పే గుణాత్మక మార్పు కనిపిస్తుందన్న అభిప్రాయం ప్రారంభమైంది. ఆ గుణాత్మక మార్పు దక్షిణాది ఉద్యమమే అంటూ వాదనలు బయల్దేరాయి.
ప్రాంతీయ ఉద్యమాలు చేయడంలో కేసీఆర్ దిట్ట అనే చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిన కొత్తలో తెలంగాణ ఏర్పాటు అస్సలు సాధ్యపడదని, ఏది ఏమైనా ఉద్యమాన్ని అణచివేయాలని కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో వ్యూహాలు పన్నారు. ఆ సమయంలో కేసీఆర్ ఆయనకు లొంగారని అపవాదు ఉన్నా.. ఆయన మరణానంతరం కేసీఆర్ చక్రం తిప్పడం, తెలంగాణ సమాజం ఉద్యమం వల్ల తెలంగాణ ఆవిర్భవించింది. దేశ రాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్ దక్షిణాదిలో ఉద్యమం చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా సౌత్ పై టీఆర్ఎస్ నేతలు విపరీతమైన ప్రకటనలు గుప్పిస్తున్నారు. వారు అలా ఎందుకు చేస్తున్నారో.. కేసీఆర్ రాజకీయ చతురతపై అవగాహన ఉన్న ఎవరైనా ఈ అంశాలను కొట్టి పారేయలేరు.
ఏదైనా రాజకీయ పరిణామం జరిగినప్పుడు తక్షణ నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్ సిద్దహస్తుడనే గుర్తింపు ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలీ కాఫ్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత అణగబెట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఒక్క ఆమరణ దీక్షతో కొన్ని రోజుల్లోనే పతాక స్థాయికి తీసుకెళ్లారని, ఇందులో ఆయన ప్లాన్స్ ను ఎవరూ ఊహించలేదన్నారు. వేగంగా అవకాశాలు అంది పుచ్చుకునే కేసీఆర్ కర్ణాటక ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీని దక్షిణాది ఉద్యమంవైపు మళ్లించే అవకాశాలున్నాయన్న సంకేతాలు వస్తున్నాయి.
దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోందని (బీజేపీనా, లేక కాంగ్రెస్సా) కేసీఆర్ చాలా కాలం నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు. దానికి సాక్షాలను సైతం ఆయన చూపిస్తూ వస్తున్నారు. సౌత్ విషయంలో కేంద్రం నిర్ణయాలు వచ్చే కొద్ది రోజుల్లో వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. జనాభా దమాషాగా ఆర్థిక సంఘం నిధుల కేటాయింపు, పార్లమెంట్ సీటు విషయంలో దక్షిణాది తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇదొక్క పాయింట్ తో దక్షిణాది మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ వీటిపై మున్ముందు వర్కవుట్ చేస్తారని బీఆర్ఎస్ నేతల నుంచి టాకులు వినిపిస్తున్నాయి.