ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ల దారెటు ? ప్రస్తుతం రాజకీయంగా ఇదే చర్చ సాగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. తెలం గాణలో తెలంగాణ రాష్ట్ర సమితి లేనందున తెలంగాణ రైతు సమితి , లేదంటే తెలంగాణ రైతు సమాఖ్య ( TRS ) పేరుతో పార్టీ పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు.
అంతేకాదు బీజేపీలోకి వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారట. అయితే అనుచరులు మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి వెళితే మంచిదని అంటున్నారట. దాంతో ఏమి చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. అందుకే ఏ పార్టీలో చేరాలి ? ఏం చేయాలి అనే మీమాంసలో పడిపోయారట.
ఇక ఈ ఇద్దరినీ తమ పార్టీలోకి తీసుకోవడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. కేసీఆర్ ను మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు ఈ ఇద్దరు. దాంతో కేసీఆర్ ను ఓడించే పార్టీలోనే చేరాలని , లేదంటే కొత్త పార్టీ పెట్టి కనీసం 10 స్థానాలు దక్కించుకుంటే అప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా మన మద్దతు కావాలి కాబట్టి అప్పుడు తప్పకుండా మనకు ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారట. త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.