వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశంలో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణ గడువును పొడిగించింది .ఏప్రిల్ నెలాఖరు నాటికి కేసు విచారణను పూర్తి చేయాలని గతంలో ఆదేశించిన సుప్రీంకోర్టు.. తాజాగా సీబీఐ అభ్యర్థన మేరకు ఈ కేసు విచారణ కోసం జూన్ 20 వరకు గడువు ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే వైఎస్ అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూర్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసినట్టు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సమంజసంగా లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అవినాష్ రెడ్డికి లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలన్న ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. హైకోర్టు ఆదేశాలు దర్యాప్తుపై ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంది.
ముందుగా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇద్దరినీ ఒకేసారి విచారించాలని సీబీఐ భావించింది.. అయితే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డి కి నోటీసులు ఇచ్చే లోపే అవినాష్ రెడ్డి తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు..
ఇక ముందస్తు బెయిల్ అంశంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు బెయిల్పై తేల్చేంతవరకు అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. అయితే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరెందుకు ఊహిస్తున్నారని ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసి ఉండేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయనంతో ఉందని పేర్కొంది.