Virat Kohli Birthday Plan : టీమిండియా కెప్టెన్ కింగ్ కోహ్లి బర్త్ డేను భారీగా సెలబ్రేట్ చేసేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. నవంబర్ 5న 35వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. అదే రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా, సౌతాఫ్రికాల తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ బర్త్డే ఎప్పటికీ గుర్తుండిపోయేలా మ్యాచ్ మధ్యలో సెలబ్రేషన్స్ చేసేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్లాన్ చేస్తోంది. అందులో ఓ విషయం ఇప్పుడు విరాట్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నది. ఎప్పుడెప్పుడు నవంబర్ ఐదు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూసేలా చేస్తున్నది.
అత్యధిక ఫాలోవర్లు..
ప్రపంచంలోనే అత్యధిక మంది ఫాలోవర్లను కలిగిన క్రికెటర్ విరాట్ కోహ్లి. క్రికెట్ను ఇష్టపడే ప్రతి వ్యక్తీ అభిమానించే ఏకైక స్టార్ క్రికెటర్. కింగ్ కోహ్లి ఫామ్లో లేనప్పుడే అతని ఫ్యాన్స్ను ఆపడం సాధ్యం కాదు. ఇక వన్డే ప్రపంచకప్లో విరాట్ జోరు చూసిన తర్వాత అభిమానుల అవధులకు అడ్డేముంటుంది? అలాంటిది ఇప్పుడు ఏకంగా విరాట్ కోహ్లి పుట్టినరోజు వస్తుండడంతో సంబరాలు అంబరాన్ని తాకేలా ఏర్పాట్లు చేస్తన్నారు. ఈ ఈవెంట్ కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్5తేదీన ఇండియా, సౌతాఫ్రికా జట్లు మ్యాచ్ ఆడనున్నాయి. ఇప్పటికే సెమీస్ బెర్తును ఈ రెండు జట్లు దాదాపుగా ఖాయం చేసుకున్నాయి. టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శనతో అభిమానులను ఖుషీ చేస్తున్నారు. నెదర్లాండ్స్తో మ్యాచ్ మినహా మిగతా అన్నింటిలోనూ సఫారీలు ఉత్తమ ప్రదర్శన చూపారు. సౌతాఫ్రికా బ్యాటర్ల వీరవిహారానికి స్టేడియాల్లో అభిమానుల ఆనందోత్సాహాలతో వేడుకలను తలపిస్తున్నాయి. మరోవైపు చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా ఆడిన అన్ని మ్యాచ్లలోనూ విజయాలు సాధిస్తూ దూసుకెళ్తోంది టీమిండియా.
సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు శ్రీలంకతో తలపడనున్నప్పటికీ.. ప్రస్తుతం మెన్ ఇన్ బ్లూ ఉన్న ఫామ్ చూస్తే లంకేయులకు మనల్ని ఆపడం కష్టమే. ఈ నేపథ్యంలో నవంబర్ 5న ఈడెన్ గార్డెన్ వేదికగా మినీ మహా సంగ్రామాన్ని తలపించనున్నది. అయితే అదే నవంబర్ 5న విరాట్ కోహ్లి పుట్టినరోజు కావడంతో పెద్దఎత్తున సెలబ్రేషన్స్ చేసేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రత్యేకంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు విరాట్ కోహ్లి పుట్టినరోజు అందరికీ గుర్తుండిపోయేలా ఈడెన్ గార్డెన్స్లో లేజర్షోను సైతం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే బాణాసంచా వెలుగులతో ఈడెన్ గార్డెన్స్ దద్దరిల్లిపోనున్నది. వీటిన్నింటికీ మించి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ వేసిన మరో ప్లాన్ కింగ్ కోహ్లీ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తోంది.
మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వచ్చే 70 వేల మంది ప్రేక్షకులకు విరాట్ ఫేస్ మాస్కులు ఇవ్వాలని క్యాబ్ నిర్ణయించింది. ఈ సంగతి తెలిసిన విరాట్ కోహ్లి ఫ్యాన్స్ సంబురపడుతున్నారు. మ్యాచ్ సమయంలో గ్రౌండ్ మొత్తం విరాట్ కోహ్లీ మాస్కులు వేసుకుని కనిపిస్తే సీన్ అదిరిపోతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే విరాట్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయిస్తున్న కేక్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. విరాట్ పుట్టినరోజు ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా కేక్ డిజైన్ చేయిస్తున్నట్లు క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహసిస్ గంగూలీ వెల్లడించారు.
“ఇప్పుడే అన్నీ చెప్పలేను. కొంచెం సర్ప్రైజ్ ఉండనివ్వండి. మ్యాచ్ మధ్యలో విరాట్తో పాటు ప్రేక్షకుల కోసం బాణాసంచా పేల్చాలని ప్లాన్ చేశాం. విరాట్ పుట్టినరోజున మా పద్ధతిలో సెలబ్రేట్ చేస్తాం. కోల్కతా మొత్తం అందులో పాలుపంచుకుంటుంది. మొత్తం స్టేడియం విరాట్ ఫ్యాన్స్తో నిండిపోతుందని ఆశిస్తున్నా”.. అంటూ గంగూలీ వెల్లడించారు