End of the Campaign in Telangana : తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. నవంబర్ 30న ఓట్లు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచంలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగుస్తుంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. బీఆర్ఎస్ తరఫున కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఎస్పీ తరఫున ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి, బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచార పర్వం ముగిసింది. ఇప్పుడు ప్రలోభాల పర్వం మొదలు కానుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు రూ. 2 వేల నుంచి రూ.3 వేల వరకు, మరికొన్ని నియోజకవర్గాల్లో రూ. 5 వేలు చొప్పున ఇస్తున్నారని చెబుతున్నారు. మరికొన్ని చోట్ల మద్యం, డబ్బు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే చాలా డబ్బు, మద్యం పట్టుబడింది. దీంతో ప్రలోభాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్నాయి.
ఈనేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీల మధ్య నువ్వా నేనా అనే ధోరణిలో ప్రచారం సాగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా మారింది. బీజేపీ ఈ సారి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చి అధికార పార్టీకి ఓట్లు రానీయకుండా చేసిందని చెబుతున్నారు. ఈక్రమంలో మూడు పార్టీల మధ్య రసవత్తరంగా మారనుంది.