Telangana Congress :
తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు నేతలు తామే సీనియర్లమంటూ కొత్తగా చేరిన నేతలను ఇబ్బందులు పెడుతుంటారు. అంతా తమదే నడుస్తుందని నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల మూడ్ నడుస్తున్నది. ఇక అందరి తలరాతలు హైకమాండ్ చేతుల్లోకి వెళ్లింది. టిక్కెట్ల విషయంలో సీనియర్ల మాటలు పనికిరావడంలేదు. దీనికి కారణం వారికి హైకమాండ్ షాకే కారణమని అంతా అనుకుంటున్నారు.
ఇక మాజీ మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా తమతో పాటు తమ అనుచరులకు టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అయితే చాన్స్ లేదని, బీఫామ్ ఎవరికీ కావాలో తేల్చుకోవాలని హైకమాండ్ నేరుగా చెప్పినట్లుగా సమాచారం. చేరికల విషయంలోనూ అడ్డుకుంటే ఊరుకోబోమని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తున్నది. నల్గొండలో వేముల వీరేశం రాకను కోమటిరెడ్డి అడ్డుకుంటారని ముందుగా అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు కిమ్మనకుండా ఉండడం వెనుక హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని అంతా అనుకుంటున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరికల జోష్ నడుస్తున్నది. ఇక ఇఫ్పటికే పొంగులేటి, జూపల్లి, తుమ్మల, మైనంపల్లి వంటి నేతల రాకతో మరింత పటిష్టంగా మారింది. బీఆర్ఎస్ తో నేరుగా తలపడే నాయకుల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత సున్నితంగా వ్యవహరిస్తున్నది. ధీటైన అభ్యర్థులను ఈసారి బరిలో దింపి చావోరేవో తేల్చుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది. హైకమాండ్ ఈ విషయంలో సీరియస్ గా ఉండడంతో, ఈసారి సీనియర్లు నోరెత్తలేని పరిస్థితి ఉంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుండడం పార్టీ లో మంచి పరిణామంగా అంతా భావిస్తున్నారు. కొందరు నేతల కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నా, వారికి కఠిన హెచ్చరికలు జారీ చేస్తూ ముందుకెళ్తున్నారు.