CM Disputes in Congress : కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది. ఏ రాష్ర్టాల్లో అయినా లీడర్లు తామే బెస్ట్ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇక తెలంగాణలో మరింత దారుణంగా ఉంటుంది. ఎవరికి వారే సీఎంలు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. వారి మధ్య ఐక్యత లేకపోవడమే బీఆర్ఎస్ కు నిజానికి బలంగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని వర్గాలు మినహా చాలా మంది ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల వాదన. కానీ అలా ప్రత్యామ్నాయంగా ఎదిగిన నేత ఏ ఒక్కరూ లేకపోవడమే ఇక్కడ బీఆర్ఎస్ కు బలం.
అయితే ప్రస్తుత పోరు కాంగ్రెస్ దూకుడుగా కనిపిస్తున్నది. నేతలు కూడా కొంత సయోధ్యతో ముందుకెళ్తున్నారు. ఎక్కడా ఒకరిపై ఒకరు దూషించుకోవడం లేదు. టికెట్లు రానివారు కొంత అసంతృప్తికి లోనైనా, మెజార్టీ సీనియర్ నేతలు కొంత సంయమనం తో ఉన్నారు. అయితే తాజాగా అప్పుడే పార్టీ గెలిచిందనుకున్నారో ఏమో గాని తామే సీఎంలు అని ప్రకటించేస్తున్నారు. తాజాగా సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి సీఎం అయ్యే చాన్స్ వస్తుందంటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన ఈసారి బరిలో లేరు. తాను ప్రాతినథ్యం వహించే నాగార్జున సాగర్ నుంచి ఈసారి కుమారుడిని బరిలోకి దింపారు.
అయితే పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ విషయంలో సీనియర్లను కట్టడి చేసింది. కట్టుబాట్లు దాటితే సీనియర్, జూనియర్ అయినా వేటే అన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు చాలా మందికి ఓ క్లారిటీ ఉంది. పార్టీని గెలుపు వరకుతీసుకెళ్లే సత్తా ఏ నేతకు ఉంది. ప్రజాకర్షణ ఎవరికి ఉందో అందరికీ తెలుసు. అయినా మేం సీనియర్లం అనే ట్యాగ్ తో కొందరు ముందుకెళ్లేందుకు ఇప్పుడే సిద్ధమవుతున్నారు. కష్టమొకరిది.. సోకకరిది అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మరి సీఎం కేసీఆర్ కు ఇది వరంగా మారితే మాత్రం ఒక కాంగ్రెస్ పార్టీని ఎవరూ కాపాడలేరు.