తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు హస్తిన పర్యటన పెట్టుకున్నారో సమాధానం చెప్పాలని టీబీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. అకాల వర్షాలు,వడగళ్ల వానల వల్ల అన్నదాతలు రాష్ట్రంలో అరిగోస పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనుండడంపై మండిపడ్డారు. బుధవారం ఆయన సిరిసిల్లా నియోజకవర్గం గంభీరావుపేటలో పర్యటించారు. రాళ్ల వానతో దెబ్బ తిన్న పంటలను పరిశీలించారు.
వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు. అన్నదాతలను చూస్తుంటే కళ్లపొంటి కన్నీళ్లు ఆగడం లేదన్నారు. రాష్ట్రంలో ఇంతటి దారుణమైన పరిస్థితులుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం జాతీయ రాజకీయాలంటూ.. ఢిల్లీలో పార్టీ ఆఫీసుల ఓపెనింగ్ పేరుతో చక్కర్లు కొట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ పరిస్థితే ఇలా ఉంటే అధికారులు ఇంకా అధ్వానంగా తయారయ్యారని విమర్శించారు. ప్రస్తుతం అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో అస్సలు పర్యటించడం లేదన్నారు. వారి వాలకం చూస్తుంటే యధా రాజా తధా ప్రజా అన్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నారు. అందుకే క్షేత్ర స్థాయిలో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటున్నట్లు బిల్డిప్ ఇచ్చేందుకు ఏదో కాగితాల మీద రాతలు రాస్తూ..కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు.
అన్నదాతల విషయంలో ప్రభుత్వం ఇలా మొండిగా వ్యవహరిస్తుంది కాబట్టే తెలంగాణ దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు పేరుతో సర్కార్ రైతులను సంబురపరిచే ప్రయత్నాలు చేసిందని,కానీ,చాన్నాళ్ల క్రితమే ధాన్యం కొంటామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ..ఇప్పటి వరకు సేకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.