e Visa Services : జీ20 దేశాధినేతల వర్చువల్ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండు నెలల నుంచి కెనడా పౌరులకు ఈ – వీసా సేవలను భారత్ నిలిపివేసింది. అయితే, జీ20 సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ – వీసా సేవలను పునరుద్ధరించింది. ఖలీస్థానీ అంశంపై భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
భారత్ – కెనడా మధ్య కొన్ని నెలలు నుంచి దౌత్యపరమైన ఉద్రిక్తతల కొనసాగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 21 నుంచి కెనడా పౌరులకు వీసా సర్వీసులను భారత్ నిలిపేసింది. ఆ తరువాత ఈ నిర్ణయాన్ని కొంత మార్చుకుంది. భద్రతాపరమైన పరిస్థితులను సమీక్షించిన తరువాత అక్టోబర్ 26 నుంచి కెనడా పౌరులకు ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా కేటగిరీలో సేవలను పునరుద్ధరించింది తాజాగా ఈ – వీసా సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇప్పుడు కెనడా పౌరులకు అన్ని రకాల వీసా సర్వీసులను భారత్ పునరుద్ధరించినట్లు అయింది.
ఖలీస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ పై తీవ్ర ఆరోపణలను కెనడా ప్రధాని కొద్ది రోజుల కిందట చేశారు. అక్కడి భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు కూడా వేశారు. కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్.. భారత్ లోని కెనడా రాయబారిని కూడా బహిష్కరించింది. కెనడాలో హింసాత్మక ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రవాస భారతీయులు, కెనడా వెళ్లాలనుకునే వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ అడ్వైజరీ కూడా భారత జారీ చేసింది. అదే సమయంలో దౌత్య సిబ్బంది విషయంలో ఇరుదేశాల మధ్య సమ స్థాయి ఉండాలని పేర్కొంటూ భారత్ లో తమ దౌత్య వేత్తల సంఖ్యను తగ్గించుకోవాలని ట్రూడో సర్కార్ కు సూచించింది.
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జి20 దేశాధినేతల వర్చువల్ సదస్సు జరగనుంది. ఈ భేటీలో కెనడా ప్రధాని ట్రూడో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ వీసాలా పునరుద్ధరణ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.