Pakistan Egg : దాయాది దేశం పాకిస్తాన్ ఆర్థిక మాంద్యం నుంచి ఇప్పటికీ బయటపడడం లేదు. గతంలో రొట్టెల పిండి కోసం తీవ్ర పోరాటమే జరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో ఆ దేశం పేరు తలిస్తే చాలు.. విదేశీయులు కూడా పాపం అంటున్నారు. పొరుగు దేశం భారత్ ఎదుగుతుంటే తాము రోజు రోజుకు మరింత దిగజారిపోతున్నామని పాకిస్తానీయులు అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తున్నారు. ప్రజాభీష్టాన్ని మరిని ఉగ్రవాదుల కనుసన్నల్లో ప్రభుత్వాలు నడిపే ప్రతీ దేశానికి ఇలాంటి పరిస్థితే వస్తుంది.
పాకిస్తాన్ లో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏదో ఒక వస్తువు అనుకుంటే పోనీలే అనుకోవచ్చు.. కానీ.. ప్రతీ వస్తువు అక్కడ విపరీతమైన ధర పలుకుతుంది. విలాసవంతమైన జీవనాన్ని ఎప్పుడో మరిచిన పాకిస్తానీయులు ఇప్పుడు రొట్టెల పిండి, కడుపు నింపుకునేందుకు నిత్యావసరాల కోసం పోరాటమే చేస్తున్నారని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో కోడిగుడ్డు రేటు పాకిస్తానీయులను భయపెడుతుంది. పౌల్ట్రీలలో ఉపయోగించే సోయాబీన్ సరఫరా పూర్తిగా తగ్గింది. దీంతో ఎగ్ ప్రొడ్యూసింగ్ ఆగిపోయింది. ఇక చేసేది లేక పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎగ్ రేటును అమాంతం పెంచేసింది. 30 డజన్ల (360 గుడ్లు) కోడిగుడ్లను రూ. 10,500 నుంచి రూ. 12,500 వరకు అమ్ముతుంది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డజనుకు రూ. 360కి అమ్మాలని ప్రభుత్వం చెప్తున్నా.. వ్యాపారులు మాత్రం రూ. 389కి విక్రయిస్తున్నారు. ఇక ఒక్క గుడ్డు ధర రూ. 32కి చేరింది.
సోయాబీన్స్ దిగుమతి కోసం ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చినా.. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతోందని ఆల్ పాకిస్తాన్ బిజినెస్ ఫోరం స్పష్టం చేసింది. ఆహారం, ఇంధనం, నిత్యావసరాలు ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది.