Asia Cup 2023 :
ఆసియా కప్ లో ఫైనల్ కు చేరకుండా పాకిస్థాన్ జట్టు ఓటమి పాలైంది. అయితే ఇటీవల ఆ జట్టులో విభేదాలు తారాస్థాయికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ జట్టు ఆటగాళ్ల మధ్య సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. అయితే ప్రస్తుతం పాక్ జట్టు వైస్ కెప్టెన్ షాబాద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఆసియా కప్ లో శ్రీలంక పై ఓటమి తర్వాత పాక్ జట్టులో విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. డ్రెసింగ్ రూమ్ లో ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా సమాచారం. పాక్ కెప్టెన్ బాబర్ అజమ్, మరో ఆటగాడు షహీన్ షా ఆఫ్రిదీ మధ్యలో గొడవ జరిగినట్లుగా ప్రచారం జరుగుతున్నది. అయితే సీనియర్ ఆటగాళ్ల పై బాబర్ నిరాశ వ్యక్తం చేశాడని, ఇందులో వైస్ కెప్టెన్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ గొడవపై ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ నడుస్తున్నది.
అయితే ఇప్పుడు పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మైదానంలో బాబర్ కెప్టెన్సీని తాము ఎంజాయ్ చేయలేమని చెప్పుకొచ్చారు. మైదానంలోకి దిగితే చాలు అతను పూర్తిగామారిపోతాడు. మ్యాచ్ అయ్యేంత వరకు అదే మూడ్ లో ఉంటాడు. కానీ మైదానం బయట మా కెప్టెన్ పెద్ద సరదా మనిషి, ఎంతో నవ్విస్తాడు అంటే వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కెప్టెన్ బాబర్, పాక్ చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ ను కలిశాడు. వరల్డ్ కప్ టీమ్ పై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లను జట్టునుంచి తప్పించాలని కోరినట్లు తెలిసింది. ఇక వైస్ కెప్టెన్సీని షాహీన్ ఆఫ్రిదీకి అప్పగించనున్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుత వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ స్థానంలో యువ బౌలర్ అబ్రర్ అహ్మద్ ను తీసుకుంటారని తెలుస్తున్నది. అబ్రర్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. 6 టెస్టు మ్యాచులు ఆడి, 38 వికెట్లు తీశాడు. షాదాబ్ కంటే, ప్రస్తుతం అబ్రర్ ఫామ్ ఉత్తమంగా ఉందనే అభిప్రాయంలో ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఉన్నట్లు సమాచారం. అయితే ఇక జట్టుపై అధికార ప్రకటన వస్తే ఎవరికి చోటు దక్కిందో తేలనుంది.