Anganwadi Workers : ఏపీలో అంగన్ వాడీ కార్యకర్తల సమ్మె 21వ రోజుకు చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ జీతాలు పెంచేలా బటన్ నొక్కాలని.. లేదంటే మరో మూడు నెలల్లో తాము నొక్కే బటన్ తో రాష్ట్రంలో వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. మచిలీపట్నంలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కొత్త ఏడాది సందర్భంగా కార్మికులు తమ సమ్మెను కొనసాగిస్తూ శిబిరంలోనే కేకు కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
కొత్త సంవత్సరంలో ఇంటి పట్టున ఉండాల్సిన తమను సీఎం జగన్ ఇలా నడిరోడ్డు మీద కూర్చుబెట్టారని, తాము ఇంతలా అవస్థలు పడుతుంటే ఆయనకు తమపై కనికరం కలగడం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల మంది కార్యకర్తలు సమ్మెలో ఉంటే.. సీఎం జగన్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చింది మీరు కాదా? మీ మాటలను నమ్మి ఓటు వేస్తే.. ఇలా అన్యాయం చేస్తారా? అంటూ మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు.
విజయవాడలో అంగన్ వాడీ కార్యకర్తలు మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు అంటూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రభుత్వం తీరు ఇలాగే కొనసాగితే తాము కూడా వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం చూసుకుంటామని హెచ్చరించారు. తమకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడం అబద్ధమన్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు రెంట్లు, ఫోన్లు తమ కోసం ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఫోన్లతో తమకు పనిభారం మరింత పెరిగిందని వాపోయారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో వేతనాలు పెంచారని, గ్రాట్యూటీ కూడా చాలా రాష్ట్రాల్లో అమలవుతోందని, తమపై ప్రభుత్వ వైఖరితో తాము తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామన్నారు.