Zee News-Matrize Survey : మరికొద్ది రోజుల్లోనే 2024 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఈ సారి ఎన్డీఏ, ఇండియా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు అధికారంలోకి వస్తారు? అని లెక్క జోరుగా నడుస్తోంది. ఇప్పటికే పలు సర్వేలు తమ అంచనాలు ప్రకటించాయి. తాజాగా జీ న్యూస్- మ్యాట్రిజ్ సంస్థ ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 27వ తేదీ వరకు చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 543 లోక్ సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 377 సీట్లు, ఇండియా కూటమి కేవలం 94 సీట్లు గెలుచుకోనున్నాయని తెలిపింది.
ఈ సంస్థ వివిధ రాష్ట్రాల్లోనూ సర్వే నిర్వహించింది. దక్షిణ భారత్ లోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్నాటకలోనూ సర్వే చేసింది. ఇక్కడ మొత్తం 28 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేయబోతోంది. సర్వే అంచనాల ప్రకారం బీజేపీ కూటమికి 23 సీట్లు, అధికార కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకుంటాయని పేర్కొంది.
కర్నాటకలో అధికార కాంగ్రెస్ 20 సీట్లకు పైగా గెలుచుకోవాలనే లక్ష్యం పెట్టుకుంది. అయితే ముందస్తు లోక్ సభ ఎన్నికల సర్వే ఆ పార్టీ నేతలను నిరాశకు గురిచేసింది. సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుపొందాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. దీనికోసం సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యూహరచన చేస్తున్నారు.
ఇక తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ హవా ఉంటుందని సర్వే చెపుతోంది. ఇక్కడ కాంగ్రెస్ 9 సీట్లు, బీజేపీ 5 సీట్లు, బీఆర్ఎస్ 2 సీట్లు, ఇతరులు 1 సీటు గెలుపొందుతారని అంచనా వేసింది. లోక్ సభ ఎన్నికలు కావడంతో జాతీయ పార్టీల మధ్యే పోటీ హోరాహోరీ ఉంటుందని, రాష్ట్రీయ పార్టీ అయిన బీఆర్ఎస్ కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని పేర్కొనడం గమనార్హం. ఇక కాంగ్రెస్ 9 సీట్లలో విజయ ఢంకా మోగించడానికి కారణం ఆరు గ్యారెంటీలు, రాష్ట్రంలో అధికారంలో ఉండడం..అని సర్వే భావిస్తోంది. ఇక బీజేపీకి 5 సీట్లు రావడానికి కారణం దేశవ్యాప్తంగా మోదీ హవా ఉండడం, ఆయన దరిదాపుల్లో ఏ ప్రతిపక్ష నేత లేకపోవడం బీజేపీకి కలిసి వస్తుందని అంచనా వేస్తోంది.