ఈ సీజన్ లో మామిడిపండ్లు బాగా దొరుకుతాయి. మార్కెట్ లో ఎటు చూసినా మామిడి పండ్లే కనిపిస్తాయి. పండ్లలో రారాజుగా దీనికి పేరుంది. ఆకర్షణీయంగా కనిపించే మామిడి పండు చూస్తేనే నోరూరుతుంది. తినాలనే కోరిక పుడుతుంది. దీంతో ఈ కాలంలో వీటిని విరివిగా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఎక్కువ తింటే వేడి చేస్తుందని అంటారు. ఇది అపోహ మాత్రమే. ఏ కాలంలో దొరికే పండ్లనయినా పుష్టిగా తింటేనే మనకు మంచిది.
మామిడి పండు తియ్యదో కాదో తెలుసుకోవడానికి కూడా కొన్ని చిట్కాలు ఉన్నాయి. పండు మనకు అందంగా కనిపించినంత మాత్రాన అది తియ్యగా ఉండాలని లేదు. దాన్ని పరీక్షించాకే తీసుకుంటే మనకు నష్టం ఉండదు. ఇటీవల కాలంలో పండ్లను రసాయనాలు వాడి మాగబెడుతున్నారు. దీంతో దాని సహజత్వం పోయి రుచి లేకుండా పోతుంది. అందుకే ఈ చిట్కాలు పాటిస్తే మామిడి పండు గురించి తెలుసుకోవచ్చు.
మామిడిపండు తొడిమెను చూసి అంచనావేయొచ్చు. తొడిమె చుట్టు భాగం దగ్గరకు వచ్చినట్లుగా ఉండి కుంచించుకుపోయినట్లు ఉంటే అది సహజమైనదిగా భావించుకోవాలి. రసాయనాలు వేసిన పండు తొడిమె కూడా నిగనిగలాడుతుంది. అది రుచిగా ఉండదు. నేచురల్ గా పండిన పండుకే తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. కొనేటప్పుడు ఇలా పరిశీలిస్తే తెలిసిపోతుంది.
ఇంకా మామిడిపండు కింది భాగం పరిశీలిస్తే తెలుస్తుంది. కింది భాగం నలుపుగా లేదా ముదురు రంగులో ఉండి దాని చర్మం ఎండినట్లుగా ఉంటే అది తాజా పండు కాదని అర్థం. మామిడి పండును నొక్కి చూస్తే అది మెత్తగా రసంగా అనిపిస్తే సహజమైనదిగా గుర్తించాలి. అదే నొక్కుతుంటే జారినట్లు అనిపిస్తే అది రసాయనాలు వేసి పండించిందని తెలుసుకోవాలి.
మామిడి పండు వాసన కూడా ముఖ్యమే. సహజంగా పండించిన పండు అయితే దాని వాసన తీయగా ఉంటుంది. మందులు వేసి పండించిందయితే వెనిగర్ వాసన డామినేట్ చేస్తుంది. ఇలా మామిడి పండ్లను కొనేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే మనకు తియ్యని పండ్లు సొంతమవుతాయి. మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోతే నష్టం జరుగుతుంది.