Janasena, TDP : ఏపీలో ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో ఇక పరిస్థితులు మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపునకు కావాల్సిన అన్ని అస్ర్తాలు సిద్ధంచేస్తున్నారు. అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వైసీపీ కి గత ఓటు బ్యాంక్ గా ఉన్న మహిళలను తమ వైపు తిప్పుకునేలా మహాశక్తి పేరిట పథకాలను ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో మహిళలపై దాడులు పెరిగాయని, టీడీపీ అధికారంలోకి వస్తే వారి అంతు చూస్తామని చెబుతున్నారు. మరోవైపు జనసేన కూడా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నది. జనసేనాని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో జగన్ సర్కారు తీరుపై మండిపడుతున్నారు.
అయితే తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ జనసేన, టీడీపీ పొత్తు వందశాతం ఖాయమని, బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశముందని చెప్పారు. అయితే కూటమి విజయం ఖాయమని స్పష్టంచేశారు. రానున్న రోజుల్లో వైసీపీ, జగన్ కు కష్టకాలమేనని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే ఇరు పార్టీలు రెండు వైపుల నుంచి వైసీపీని చుట్టుముట్టాయని, జగన్ ప్రభుత్వంలో వణుకు మొదలైందని మాట్లాడారు. పైకి ప్రగల్భాలు పలుకుతున్నా, జగన్ కేవలం సంక్షేమ పథకాలంటూ కూర్చున్నారని తెలిపారు. కానీ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అని, దానిని జగన్ ప్రభుత్వం విస్మరించిందని చెప్పుకొచ్చారు. ఇక టీడీపీ, జనసేనల గెలుపును ఎవరూ ఆపలేరని, వైసీపీ నేతలు కూడా తమవైపు చూస్తున్నారని పేర్కొన్నారు.
ఓ వైపు ఏపీలో టీడీపీ యువనేత లోకేశ్ యువగళం పాదయాత్ర ద్వారా ఇప్పటికే చాలా జిల్లాలు చుట్టివచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటివరకు వైసీపీ ఏమాత్రం బరిలోకి దిగలేదు. వై నాట్ 175 అంటూ ఐప్యాక్ ను నమ్ముకొని ముందుకెళ్తున్నారు. అయితే నమ్ముకోవాల్సింది ప్రజలను కానీ ఐ ప్యాక్ ను కాదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీలు కలిసి వైసీపీ పై ఎదురుదాడిని మరింత పెంచే అవకాశమున్నది. రఘురామ కూడా అదే స్పష్టం చేశారు.
రానున్న రోజుల్లో వైసీపీ చుక్కులు కనిపిస్తాయని అంటున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇప్పటివరకు నేరుగా రంగంలోకి దిగలేదు. ఆయన తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన జగన్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఒక్క చాన్స్ అనగానే అవకాశం ఇచ్చిన ప్రజల నెత్తినెక్కి ఇబ్బందులు పెడుతున్న జగన్ ను ఇక గద్దె దించడమే తమ లక్ష్యమని ఇరు పార్టీలు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వమని పవన్ మాట్లాడుతున్నారు. దీంతో ఇరు పార్టీలు ఇక పొత్తుతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తున్నది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా అదే స్పష్టం చేశారు.