- 19న విచారణకు రావాలని ఆదేశం
Avinash : ఏపీ సీఎం జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో ఛాన్స్ ఇచ్చింది. ఈనెల 19న విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. వివేకా హత్య కేసులో ఆయనను సీబీఐ కొన్ని రోజులుగా విచారిస్తున్నది. వివేకా కూతురు సుప్రీం కోర్టు తలుపు తట్టిన నేపథ్యంలో సీబీఐ దూకుడు పెంచింది. వచ్చే నెలాఖరులోగా కేసును కొలిక్కి తేవాలని సుప్రీం ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ రెడ్డి పెట్టుకున్న విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది.
మంగళవారం గైర్హాజరు
ముందుగా ఈనెల 16న విచారణకు రావాలని సీబీఐ అవినాష్ కు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని తమ కార్యాలయానికి 11 గంటలకు రావాలని ఆదేశించింది. అయితే వ్యక్తిగత కారణాలతో నాలుగు రోజుల పాటు విచారణకు రావడం వీలు కాదని ఎంపీ అవినాష్ సీబీఐ కి లేఖ రాశారు. ఆ వెంటనే హైదరాబాద్ నుంచి కడప బయల్దేరి వెళ్లారు. దీనిని కూడా సీబీఐ సీరియస్ గా తీసుకుంది. అయితే ఆయన మార్గ మధ్యంలో ఉండగానే ఈ నెల 19న విచారణ కు వచ్చేందుకు మరోసారి ఛాన్స్ ఇస్తూ మరోసారి నోటీసులు అందజేసింది. ఇప్పటికే అవినాష్ ను అరెస్ట్ చేయడం ఖాయమనే ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరింత ఉత్కంఠ కలిగిస్తున్నాయి.
చుట్టుముట్టిన వివాదం
ఎంపీ అవినాష్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆప్తుడు. ప్రస్తుత పరిణామాలు జగన్ కు కూడా తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. అవినాష్ అరెస్ట్ కాకుండా ఆయన ఎన్నో విధాలా ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వివేకా కూతురు సునీత న్యాయపోరుతో ఆయనకు చుక్కెదురవుతున్నది. అయితే ఈ కేసులో అవినాష్ పూర్తిగా మునిగిపోయినట్లేనని , ఇక రేపో మాపో అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. మరి రానున్న రోజుల్లో కడప ఎంపీ అవినాష్ అరెస్టయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తానికి బాబాయ్ హత్యకేసును ప్రత్యర్థుల మీద వేసి చేయి దులుపుకుందమనుకున్న జగన్ కు తిరిగి తిరిగి తన మెడకే చుట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నది. సో.. ఇక బంతి సీబీఐ, సుప్రీం కోర్టులో ఉంది.