తుమ్మల..ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేత. మంత్రి పువ్వాడ ఆజయ్,ఎంపీ నామానాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి తర్వాత జిల్లా పాలిటిక్స్లో ముఖ్యమైన నేత. సుదీర్ఘ రాజకీయ అనుభవముంది. ఈయన మంత్రిగా పని చేసినప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించారు.
ఇలాంటి తుమ్మల ఇప్పుడు తనకు కొన్ని కోరికలున్నాయని చెబుతున్నారు. రాజకీయంగా ఈస్థాయికి వచ్చేందుకు అవకాశం కల్పించిన జిల్లా ప్రజలకు మంచి చేయాలని కొన్ని ఆశలున్నాయని అంటున్నారు. ఖమ్మం నుంచే గోదావరి నది పారుతుందన్న విషయం తెలిసిందే. అయితే ఖమ్మం జిల్లా పంట పొలాలకు మాత్రం సాగు నీరందడం లేదు. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా వాటర్ ఖమ్మం బీడు భూములను సస్య శ్యామలం చేస్తున్నప్పటికీ..గోదావరి నీళ్లు మాత్రం జిల్లాకు అందడం లేదు. అంతేకాక అడవులు ఎక్కువగా ఉండే ఖమ్మంలో రహదారుల పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే తుమ్మల తన కోరికను బయట పెట్టేశారు. గోదావరి నీటిని ఉమ్మడి ఖమ్మం జిల్లా బీడు భూములకు మళ్లించాలనే కోరిక ఎన్నో ఏళ్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా తన కోరిక నేరవేరే అవకాశం కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు తన చిరకాల వాంఛ అయిన గోదావరి డెలవప్ మెంట్కు ప్రభుత్వాలు పూనుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జాతీయ రహదారులు గోదావరి పరివాహక ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ..నిర్మిస్తుండడం సంతోషకరమైన విషయమన్నారు.