CM KCR Strategy : తెలంగాణలో ఎన్నికలకు మరో 44 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో, పార్టీలన్నీ సమరానికి కాలు దువ్వుతున్నాయి. ఇక నువ్వా నేనా అన్నట్లుగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ సహా కాంగ్రెస్ ఈ పోరులో ఢీ అంటే ఢీ అంటున్నాయి. అయితే కొన్ని రోజులుగా బయటకు రాని తెలంగాణ సీఎం కేసీఆర్ వరుస పర్యటనలతో శ్రేణుల్లో ఊపు తెస్తున్నారు.
నిజానికి తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒకవైపు.. ప్రతిపక్షాలన్నీ ఒక వైపు అన్నట్లుగా రాజకీయాలు జరుగుతాయి. సీఎం కేసీఆర్ ను ఢీకొట్టాలంటే తెలంగాణను అంతకన్న ఎక్కువగా ప్రేమించే నాయకులు తెలంగాణలో ఉండాలని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతుంటాయి. ఇప్పటికే మ్యానిఫెస్టో ప్రకటించడంతో పాటు బహిరంగ సభల్లో పాల్గొంటూ నియోజకవర్గాలను చుట్టే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. మరికొన్ని రోజుల్లో ఈ ప్రచార వేడి మరింత పెరిగే అవకాశం ఉంది.ఇప్పటికే హుస్నాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఆయన సభలు ముగిశాయి. బీఆర్ఎస్ తప్పక గెలిచే స్థానాల్లో ఆయన ముందు ప్రచారం ముగించేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఎత్తుగడలను అందుకోవాలంటే ప్రత్యర్థులకు కొంత కష్టమే. ఆయన దూకుడును కొంత కూడా తగ్గించే లీడర్ తెలంగాణలో లేరని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతుంటాయి. ఇక హ్యాట్రిక్ విజయం కోసం ఆయన పక్కా వ్యూహంతో ఆయన బరిలోకి దిగారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నియోజకవర్గాలన్ని చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆయన మాటల ధాటికి ప్రతిపక్షాలు కకావికలమ్యే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కు తప్ప మరెవరికీ స్థానం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే దూకుడు గా వస్తున్న కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే అది సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యం. ఆయన వ్యూహంలో వారు చిక్కుకుంటే ఇక కోలుకోవడం కష్టం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ సారి కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకే పరిస్థితి మొత్తం మారిపోతుందనే అభిప్రాయం వినిపిస్తున్నది.