Jana Sana PArty Power Star Pawan Kalyan : జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ పొలిటికల్ వార్ కు తన వారాహి యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పలుమార్లు యాత్ర వాయిదా పడగా, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. పవన్ కల్యాణ్ యాత్ర సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉంది. ఈ యాత్రకు పోలీసుల నుంచి కూడా అనుమతి లభించింది. దీంతో యాత్రకు అన్ని అడ్డంకులు తొలిగినట్లేనని జన సైనికులు భావిస్తున్నారు. ఇక యాత్రను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని కార్యకర్తలు శ్రమిస్తున్నారు.
పాలనపై పవన్ పంచ్ లు
ఏపీ అధికార పార్టీ వైసీపీ, జగన్ ప్రభుత్వ పాలనపై పవన్ కల్యాన్ విరుచుక పడనున్నట్లు తెలుస్తున్నది. జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను పవన్ గట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తనదైన శైలిలో పవన్ కల్యాణ్ తన మార్కు డైలాగ్ పంచ్ లతో జగన్ పై దాడికి దిగనున్నారు. ప్రజా వ్యతిరేకతను తన యాత్ర ద్వారా అధికార పక్షానికి చూపించనున్నట్లుగా తెలుస్తున్నది.
పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో నిర్వహించనున్నారు. వారాహి వాహనంపై నుంచే పవన్ ప్రసంగిస్తారు. కత్తిపూడి అనంతరం పిఠాపురం, కాకినాడ గ్రామీణ, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర కొనసాగనుంది. తొలి 10 రోజుల్లో ఏడు బహిరంగ సభల్లో పవన్ మాట్లాడేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొనేందుకు జనవాణి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్నవరం నుంచి నరసాపురం వరకు వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకుల సందడి జోరందుకుంది. పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ కటౌట్లు, జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో కత్తిపూడి ప్రాంతం మొత్తం నిండిపోయింది. పవర్ స్టార్ నామ జపంతో కత్తిపూడి దద్దరిల్లనుంది. కత్తిపూడి నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర సాగనుంది. ఈసారి నుంచి పవన్ పొలిటికల్ రూట్ మ్యాప్ పకడ్బందీగా ముందుకు సాగుతుందని జనసేన వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.